shahid azmi
వంద మంది దోషులైన తప్పించుకోవచ్చు.. నిర్ధోషులు మాత్రం శిక్షించబడకూడదు…అని న్యాయశాస్త్రం చెప్పే మాట. వాస్తవం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఏ పాపం చేయని వారే ఎక్కువగా బలైపోతున్నారు. ఇదే ఓ వ్యక్తిని కదిలించింది. తనలా మరేవరికి అన్యాయం జరగకూడదని నల్లకోటు ధరించి న్యాయం కోసం పోరాడాడు.
గొంతులేని వారికి తన గొంతును అందించాడు. న్యాయ దేవత కళ్లు తెరిపించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే ఆయన ప్రాణాలను తీసింది. కానీ ఆయన హత్య కేసుకు మాత్రం న్యాయం జరగలేదు. ఎందుకంటే మరో షహీద్ అజ్మీ లేడు కదా.
మనలో ఒకరు.. మన గురించి మాట్లాడి.. మనకోసం పోరాడి.. మనం కోసమే ప్రాణాలు ధారపోస్తే ఆ మనిషిని ఏమనాలి..? అలాంటి వారి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. అలాంటి వ్యక్తే షహీద్ అజ్మీ.
షహీద్ అజ్మీ ఓ తీవ్రవాదిగా అరెస్టై, జైలు శిక్ష అనుభవించాడు. నిజానికి తీవ్రవాది కాదు. అది కేవలం ఆరోపణ మాత్రమే. ఆ అనుభవం షహీద్ అజ్మీ జీవితంపై తీవ్ర ప్రభావం వేసింది.
అప్పుడే తనలా మరెవరూ అవకూడదని నిర్ణయించుకున్నాడు. అంతే లాయర్ పట్టాను అందుకుని తనలా తీవ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొనే ఎంతోమందిని శిక్ష నుంచి బయటపడేశాడు. అలా 17 మందిని కాపాడాడు.
shahid azmi
షహీద్ అజ్మీ లాయర్. మామూలు లాయర్ కాదు తీవ్రవాదులుగా ముద్ర పడిన వ్యక్తుల కేసులను వాదించే న్యాయవాది. ముంబైలోని డియోనార్ శివారులో ఓ ముస్లీం కుటుంబంలో 1977లో పుట్టి పెరిగాడు. ఐదుగురు సంతానంలో అజ్మీ మూడోవాడు. అజ్మీ జీవితంలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.
shahid azmi
అసలు ఎవరూ ఊహించని అనుభవాన్ని అజ్మీ ఫేస్ చేయాల్సి వచ్చింది. ముంబై అల్లర్ల కేసులో భాగంగా అజ్మీని తీవ్రవాదిగా పరిగణించి 14 ఏళ్ల వయస్సులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తాను తీవ్రవాదిని కాదన్న ఎవరూ వినలేదు. టాడా కేసు పెట్టి తీహార్ జైలుకు తరలించారు.
అక్కడ ఏడేళ్లు గడిపాడు. జైల్లో ఉంటూనే డిస్టెన్స్లో చదువుకున్నాడు. న్యాయశాస్త్రంతో పాటు జర్నలిజంపై కూడా పట్టు సాధించాడు. శిక్ష పూర్తై విడుదలయ్యే సమయానికి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. కొన్ని రోజులుపాటు రూ.2000లకు సబ్ఎడిటర్గా కూడా పని చేశాడు.
shahid azmi
లాయర్ అయ్యాక న్యాయవాది మజీద్ మెమన్ దగ్గర జూనియర్గా కొన్ని నెలలు పనిచేశాడు. 2003లో అజ్మీ ముంబైలో క్రిమినల్ డిఫెన్స్ లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తీవ్రవాదుల అనే ఆరోపణలతో అరెస్టైన వారి తరఫున వాదించేవాడు. వాదించడమే కాదు ఎంతోమందిని ఆ కేసుల నుంచి బయటపడేశాడు.
అలాగే ఘట్కోపర్ బస్సు కేసులో అజ్మీ మొదటి విజయం సాధించాడు. జూలై 2008లో 7/11 ముంబై పేలుళ్లలో నిందితులను ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచి హింసించారని ఆరోపిస్తూ అజ్మీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
shahid azmi
పిటిషన్పై స్పందించిన కోర్టు ఈ కేసుపై విచారణకు ఆదేశించగా ఆరోపణలు నిజమని తేలింది. ఆ కేసులో పోటా కింద అరెస్టైన ఎనిమిది మందిని నిర్ధోషులుగా విడిపించాడు. అంతేకాదు ముంబై స్థానిక రైలు పేలుళ్లు, 2006 ఔరంగా బాద్ ఆయుధాల రవాణా, 2006 మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితుల తరఫున అజ్మీ వాదించాడు. అజ్మీ ఏడేళ్ల తన ప్రొఫెషన్ కెరీర్లో 17 మందిని నిర్ధోషులుగా విడిపించాడు.
Shahid azmi
లాయర్గా షహీద్ చేసిన పని ఎంత కష్టతరమో చెప్పడానికి ఆయన హత్యే నిదర్శనం. చాలామందికి షహీద్ హడలు పుట్టించాడు. గుండెల్లో రైళ్లు పెరుగెట్టించాడు.
ఈ దేశంలో న్యాయం దొరకడం ఎంత కష్టమో.. షహీద్ హత్య మరోసారి నిరూపించింది. అలాకాకపోయుంటే.. అసలు షహీద్ నేటికీ బతికే ఉండేవాడు. షహీద్ను 2010లో ఫిబ్రవరి 11వ తేదీన కుర్లాలోని తన ఆఫీసులో నలుగురు కాల్చి చంపారు. క్లైంట్లుగా వచ్చిన నలుగురు దుండగులు షహీద్ ప్రాణం తీశారు.
shahid azmi
షహీద్ హత్యకు గురయ్యే ఆరు నెలల ముందు తనకు బెదిరింపులు వస్తున్నాయని రక్షణ కావాలని కోర్టును ఆశ్రయించాడు. కానీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. కోర్టు రక్షణ కల్పించి ఉంటే..ఈ ఘాతుకం జరగకపోయేదేమో.. షహీద్ మన మధ్యే ఇంకా బతికి ఉండేవాడేమో…? అసలు న్యాయమే ఉండి ఉంటే.. కచ్చితంగా 32 ఏళ్లకే షహీద్ మృత్యువు కౌగిళ్లలో పడేవాడు కాదు.
షహీద్ మరణం తర్వాత అతని సోదరుడు ఖలీద్ లా పూర్తి చేసి షహీద్ కేసును వాదించే పనిలో పడ్డాడు. అయితే నేటి వరకూ ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు. షహీద్ కుటుంబం ఇప్పటికీ న్యాయం కోసం వేచి ఉంది.
షహీద్ జీవితాన్ని పరిశీలిస్తే.. ఎన్నో విషయాలు.. ప్రశ్నలై తరుముతాయి. అందులో మొదటిది ఈ దేశంలో న్యాయం దొరకడం ఇంత కష్టమా..? అని అనిపించక మానదు. ముస్లిం అయినంత మాత్రాన తీవ్రవాదులైపోతారా..? ఈ దేశం స్వతంత్ర పోరాటంలో సమిధులైన ఎంతోమంది ముస్లింలు ఉన్నారు.
shahid azmi
మరీ వారి సంగతేంటీ..? దేశంలో ఎంతోమంది ముస్లింలు తీవ్రవాదులు ముద్ర పడి జైల్లో మగ్గుతున్నారు. అలాంటి వారి స్వేచ్ఛ కోసం షహీద్ లాంటి లాయర్లు చాలా అవసరం.
అజ్మీ మరణం హిందూ, ముస్లీం బాయి.. బాయి అని చెప్పినంత ఈజీగా మాత్రం దేశంలో పరిస్థితులు లేవనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. షహీద్ డైనమిక్ పర్సన్. షహీద్ బతికుంటే.. ఇంకా ఎంతోమంది నిరపరాధులను చట్టం నుంచి రక్షించేవాడు.
షహీద్ జీవితంపై బాలీవుడ్ బయోపిక్ కూడా తెరకెక్కింది. షహీద్ పేరుతో 2013లో సినిమా వచ్చింది. ఆ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు టైటిల్ రోల్ ప్లే చేశారు.
[…] టెర్రరిస్ట్ టూ అడ్వకేట్ : షహీద్ అజ్మీ […]